దిశ కేసులో నిందితులు గతంలోనూ.....

దిశ కేసులో నిందితులు గతంలోనూ.....


శంషాబాద్‌ వెటర్నరీ డాక్టర్ దిశ నిందితులపై కూపీలాగుతున్న వారికి ఒక్కొక్కటిగా సంచలన నిజాలు బయటికి వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, జొల్లు శివ. జొల్లు నవీన్‌లకు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా వారి నేరాల చిట్టా 'దండుపాళ్యం' బ్యాచ్‌ మాదిరిగా దడ పుట్టిస్తోంది.


దిశ హత్య కంటే ముందే నలుగురు నిందితులు మరో 9మంది మహిళలపై హత్యాచారం జరిపి, హత్య చేసినట్టుగా పోలీసుల విచారణ తేలిందని సమాచారం. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితుల వాంగ్మూలంలో ఈ కీలక విషయాలు బయటపడ్డాయి. ప్రధాన సూత్రధారి ఆరిఫ్‌ అలీ 6 హత్యలు.. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు అంగీకరించారని తెలుస్తోంది. ఈ హత్యలన్నీ మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్ణాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో చేసినట్టు నిందితులు ఒప్పుకున్నారని పోలీసు వర్గాల సమాచారం.


ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం, హత్య చేసి.. మృతదేహాలను దిశ మాదిరిగానే దహనం చేసినట్టు పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. దీంతో గతంలో జరిగిన హత్యలకు సంబంధించిన డీఎన్‌ఏ రిపోర్టులను పోలీసులు పరిశీస్తున్నారు. హైవేల పక్కన జరిగిన హత్యలపై ఆరా తీస్తున్నారు. దీని కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. దిశ కేసులో ఛార్జిషీట్ వేసే సమయానికి ఈ కేసులని చేధించాలని పోలీసులు చెబుతున్నారు.


అయితే డీఎన్‌ఏ పరిశీలనలో భాగంగా పలు పాత కేసుల్లో ఆరిఫ్, చెన్నకేశవులు, శివ, నవీన్, ల డీఎన్ఏ లతో మరిన్ని హత్య కేసుల్లో మ్యాచ్ అవుతున్నట్లు సమాచారం. దీంతో విచారణను పోలీసులు మరింత వేగవంతం చేశారు. నిందితులు చెప్పిన సమాచారం ఆధారంగా ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.


నిందితులు డీఎన్‌ఏతో గత హత్యల మిస్టరీని ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ​కాగా దిశ హత్య కేసులో నిందితులుగా ఉన్న నలుగురు పోలీసుల ఎన్‌కౌంటర్‌ లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై కేసు కోర్టులో విచారణ జరుగుతుండటంతో మృతదేహాలను ఆస్పత్రిలో భద్రపరిచారు.